న్యూఢిల్లీలో 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు వేదిక మరియు సభ్య దేశాల వివరాలు


ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో సరికొత్త సమీకరణాలకు తెరలేపుతూ భారతదేశం ప్రతిష్టాత్మకమైన 18వ బ్రిక్స్ (BRICS) శిఖరాగ్ర సదస్సుకు ఆతిథ్యమిస్తోంది. 2026 సెప్టెంబర్ 11 నుంచి 13 వరకు దేశ రాజధాని న్యూఢిల్లీలోని ప్రగతి మైదాన్‌ భారత్ మండపంలో ఈ సదస్సు అత్యంత వైభవంగా జరగనుంది. ప్రపంచ జీడీపీలో గణనీయమైన వాటా కలిగిన దేశాల అధినేతలు, అంతర్జాతీయ ప్రతినిధులతో కలిపి సుమారు 30కి పైగా దేశాల ప్రతినిధులు రాజధానికి చేరుకోనున్నారు.


•  దేశ రాజధానిలో  భద్రత ఏర్పాట్లు

ప్రపంచ అగ్ర దేశాల అధినేతల భద్రతను దృష్టిలో ఉంచుకుని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ, ఢిల్లీ పోలీస్ విభాగం గగనతలం నుంచి సరిహద్దుల దాకా మూడంచెల భద్రతా వలయాన్ని (Multi-tier Security Grid) సిద్ధం చేశాయి.

సదస్సు ప్రధాన వేదిక భారత్ మండపాన్ని ఎన్‌ఎస్‌జీ (NSG) కమాండోలు, సీఆర్పీఎఫ్, పారామిలిటరీ బలగాలు తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. ఏఐ (AI) ఆధారిత ఫేషియల్ రికగ్నిషన్ కెమెరాలతో పాటు యాంటీ-డ్రోన్ గ్రిడ్‌ను భారత వైమానిక దళం (IAF) పర్యవేక్షిస్తోంది.

 వీఐపీల బస కోసం కేటాయించిన 10 లగ్జరీ హోటళ్ల వద్ద విస్తృత తనిఖీలు చేపట్టారు. ఎయిర్‌పోర్టు నుంచి వేదిక వరకు ప్రయాణించే కాన్వాయ్‌లకు రియల్ టైమ్ జీపీఎస్ ట్రాకింగ్ అమర్చి ముందస్తు రిహార్సల్స్ పూర్తి చేశారు.

వీఐపీ మూవ్‌మెంట్స్, ట్రాఫిక్ ఇబ్బందులను నివారించేందుకు సెప్టెంబర్ 11 (శుక్రవారం) నాడు ఢిల్లీలోని అన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ రంగ సంస్థలకు (PSUs) సెలవు ప్రకటించారు. మెట్రో సేవలు, అత్యవసర అంబులెన్స్ సర్వీసులకు గ్రీన్ కారిడార్లు కేటాయించారు.

• అసలు బ్రిక్స్ (BRICS) అంటే ఏమిటి? పేరు ఎలా వచ్చింది?

పాశ్చాత్య దేశాల ఆధిపత్యంలో ఉన్న ప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) వంటి సంస్థలకు ప్రత్యామ్నాయంగా, అభివృద్ధి చెందుతున్న దేశాల పరస్పర సహకారం కోసం ఏర్పడిన అంతర్జాతీయ వేదికే బ్రిక్స్.

2001లో ప్రముఖ ఆర్థిక విశ్లేషణ సంస్థ 'గోల్డ్‌మన్ సాచ్స్' (Goldman Sachs) ఆర్థికవేత్త జిమ్ ఓ నీల్ (Jim O'Neill) రాసిన పరిశోధనా పత్రంలో మొదటిసారిగా BRIC (బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా) అనే సంక్షిప్త నామాన్ని ప్రస్తావించారు. భవిష్యత్తులో ఈ నాలుగు దేశాలు ప్రపంచ ఆర్థిక వృద్ధిని నడిపిస్తాయని ఆయన విశ్లేషించారు.

•  కూటమి ఏర్పాటు

 2006 సెప్టెంబర్‌లో ఐక్యరాజ్యసమితి సాధారణ సభ సందర్భంగా ఈ దేశాల విదేశాంగ మంత్రులు భేటీ అయి కూటమికి ప్రాథమిక రూపునిచ్చారు.

•  మొదటి సదస్సు

 అధికారికంగా తొలి శిఖరాగ్ర సదస్సు 2009 జూన్ 16న రష్యాలోని ఎకతెరిన్‌బర్గ్ (Yekaterinburg) నగరంలో జరిగింది.

•  2010లో దక్షిణాఫ్రికా చేరడంతో దీని పేరు BRIC నుంచి BRICSగా మారింది.

సభ్య దేశాల విస్తరణ (BRICS Expansion)

కాలక్రమంలో ఈ కూటమి మరింత విస్తరించింది. ప్రస్తుతం బ్రిక్స్‌లో అధికారికంగా సభ్య దేశాల సంఖ్య 11కు చేరింది.

•  బ్రిక్స్ సభ్య దేశాల వివరాలు

•  వ్యవస్థాపక సభ్య దేశాలు (మొదటి 5) బ్రెజిల్, రష్యా, భారతదేశం, చైనా. 2010లో దక్షిణాఫ్రికా చేరడంతో ఇవి ఐదు వ్యవస్థాపక/కోర్ దేశాలుగా మారాయి.

•  2024లో చేరిన నూతన సభ్య దేశాలు

 ఈజిప్ట్, ఇథియోపియా, ఇరాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) మరియు సౌదీ అరేబియా.

•  2025లో చేరిన సభ్య దేశం 

ఇండోనేషియా (ఆగ్నేయాసియా నుంచి బ్రిక్స్‌లో చేరిన తొలి దేశంగా గుర్తింపు పొందింది).


ఈ 11 దేశాలు కలిపి ప్రపంచ జనాభాలో సుమారు 48%, ప్రపంచ జీడీపీ (PPP)లో 36% పైగా, మరియు ప్రపంచ ముడి చమురు ఉత్పత్తిలో 40% పైగా వాటాను కలిగి ఉన్నాయి.

భారతదేశంలో సదస్సులు 

భారతదేశం బ్రిక్స్ అధ్యక్ష బాధ్యతలను స్వీకరించి దేశంలో శిఖరాగ్ర సదస్సును నిర్వహించడం ఇది నాలుగోసారి.

4వ సదస్సు (2012) న్యూఢిల్లీ  వేదికగా ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ నేతృత్వంలో  నిర్వహించడం జరిగింది.

8వ సదస్సు (2016) గోవా వేదికగా ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో (బిమ్‌స్టెక్ దేశాలతో ఔట్‌రీచ్ భేటీ) నిర్వహించడం జరిగింది.

13వ సదస్సు (2021)  న్యూఢిల్లీ వేదికగా (వర్చువల్ పద్ధతిలో)  ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో నిర్వహించడం జరిగింది.

18వ సదస్సు (2026 - ప్రస్తుతం) న్యూఢిల్లీ వేదికగా (భారత్ మండపం) ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో జరగనుంది.

ఈ ఏడాది భారత్ ఎంచుకున్న అధికారిక థీమ్ "Building for Resilience, Innovation, Cooperation and Sustainability" (సహనశీలత, ఆవిష్కరణలు, పరస్పర సహకారం మరియు స్థిరత్వం కోసం నిర్మాణం). ప్రధాని మోదీ ప్రతిపాదించిన 'హ్యూమానిటీ ఫస్ట్' (మానవతా దృక్పథం) సిద్ధాంతంతో భారత్ ఎజెండాను నడిపిస్తోంది.

బ్రిక్స్ వల్ల సభ్య దేశాలకు, భారత్‌కు కలిగే ప్రయోజనాలు ఏమిటి?

 ప్రపంచ బ్యాంకుపై ఆధారపడకుండా సభ్య దేశాల్లో మౌలిక వసతులు, గ్రీన్ ఎనర్జీ, మెట్రో ప్రాజెక్టులకు తక్కువ వడ్డీకే నిధులు అందించేందుకు షాంఘై కేంద్రంగా న్యూ డెవలప్‌మెంట్ బ్యాంక్ (NDB)  ఏర్పాటు చేశారు. భారత్‌లోని పలు ప్రాజెక్టులకు ఈ బ్యాంక్ నిధులు సమకూరుస్తోంది.

 అంతర్జాతీయ వాణిజ్యంలో డాలర్ ఆధిపత్య ప్రభావాన్ని తగ్గించేందుకు సభ్య దేశాలు రూపాయి, రూబుల్, యువాన్ వంటి తమ సొంత కరెన్సీలలో లావాదేవీలు నిర్వహించుకుంటున్నాయి.

 రష్యా, సౌదీ అరేబియా, యూఏఈ, ఇరాన్ వంటి అతిపెద్ద చమురు ఉత్పత్తి దేశాలు ఒకే వేదికపై ఉండటం వల్ల భారతదేశం వంటి భారీ వినియోగ దేశాలకు ఇంధన భద్రత లభిస్తుంది.

ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి (UNSC) సంస్కరణలు, వాతావరణ మార్పుల నిధుల విషయంలో అభివృద్ధి చెందుతున్న దేశాల తరఫున గళం ఎత్తడానికి భారత్‌కు ఇదొక బలమైన వ్యూహాత్మక వేదికగా పనిచేస్తోంది.

రాజధాని ఢిల్లీ నగరంలో పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు, ప్రపంచ నేతల రాకతో ప్రారంభం కానున్న ఈ 18వ సదస్సు.. భారత్ అంతర్జాతీయ నాయకత్వ పటిమను, గ్లోబల్ సౌత్ దేశాల ఆర్థిక సమగ్రతను ప్రపంచ పటంపై మరోసారి సగర్వంగా నిలబెట్టనుంది.